
న్యూస్ డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది పార్టీలకు మద్దతు ఇచ్చి ఉపయోగం లేదని, తెలుగు బిడ్డ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏపీలోని ప్రధాన పార్టీలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
షర్మిల మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు ఏకం కావాలని కోరారు. “ఉత్తరాది పార్టీలకు కొమ్ము కాయడానికి బదులుగా, మన తెలుగు నేతకు మద్దతు ఇవ్వడం గర్వకారణం” అని ఆమె వ్యాఖ్యానించారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి, న్యాయరంగంలో విశేష సేవలు అందించారని ఆమె గుర్తు చేశారు. ఆయన ఎలాంటి రాజకీయ పార్టీకి చెందినవారు కాదని, స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్గా పనిచేశారని వివరించారు.
దేశంలో ప్రజాస్వామ్యం కష్టాల్లో ఉన్న ఈ సమయంలో, సుదర్శన్ రెడ్డి వంటి న్యాయవేత్త ఉపరాష్ట్రపతిగా ఉంటే రాజ్యాంగ పరిరక్షణకు బలం చేకూరుతుందని షర్మిల తెలిపారు. తెలుగు ప్రజలకు ఇది గర్వించదగ్గ విషయం అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, అవసరమైతే వ్యక్తిగతంగా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లను కలసి ఈ విజ్ఞప్తి చేస్తానని షర్మిల వెల్లడించారు. ఆమె పిలుపుతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల మద్దతు ఏ దిశగా వెళ్లనుందన్నది హాట్ టాపిక్గా మారింది.
