
న్యూస్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్లలో కీలక మార్పులు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. ఈ పిటిషన్లో రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు మాత్రమే అందేలా ఆదాయ ప్రాతిపదికను చేర్చాలని కోరారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చిల ధర్మాసనం ఈ పిల్ను స్వీకరించి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10లోగా స్పందించాల్సిందిగా ఆదేశించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదికి, ఈ వ్యాజ్యం తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉందని కోర్టు సూచించింది.
పిటిషన్ దాఖలు చేసిన రామశంకర్ ప్రజాపతి, యమునా ప్రసాద్ అనే ఎస్సీ, ఓబీసీ వర్గాల వ్యక్తులు తమ వాదనలో కీలక అంశాలు ప్రస్తావించారు. గత 75 ఏళ్ల రిజర్వేషన్ విధానంలో కొద్దిమంది ఆర్థికంగా బలమైనవారే లబ్ధి పొందుతున్నారని, నిజమైన అవసరమైన వారికి అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు.
రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయడం లక్ష్యం కాదని, దానిని మెరుగుపరచి సామాజిక న్యాయం సాధించాలని స్పష్టం చేశారు. ఆదాయ పరిమితిని చేర్చడం ద్వారా నిరుపేదలకు ప్రాధాన్యం లభిస్తుందని వివరించారు.
ఈ సంస్కరణ రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు కింది స్థాయి అర్హులకే చేరేలా చూడాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
