
న్యూస్ డెస్క్: తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సంక్రాంతి పండుగ సెలవుల తేదీలు ఖరారయ్యాయి. సంప్రదాయాలు, సంబరాలతో నిండిన ఈ పండుగ సందర్భంగా విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో సంబరాలు చేసుకునేందుకు వీలుగా విద్యా శాఖలు నిర్ణయం తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 10, 2026 నుంచి జనవరి 18, 2026 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. జనవరి 19న (సోమవారం) బడులు తిరిగి తెరుచుకోనున్నాయి.
పదో తరగతి ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈసారి తొమ్మిది రోజుల సెలవులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ సంక్రాంతి సెలవులు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మొదట్లో తక్కువ రోజులు సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ఏపీ తరహాలోనే పూర్తిస్థాయి సెలవులను ఖరారు చేసేందుకు విద్యా శాఖ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెలవుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరిలో సంక్రాంతితో పాటు మరిన్ని పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు లభించాయి.
పండుగ కోసం ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం అయ్యేందుకు ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి.
