
న్యూస్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నెలకొన్న ఆర్థిక అవకతవకలు మరోసారి హైకోర్టు దృష్టికి వెళ్లాయి. తాజాగా సఫిల్గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా పిటిషన్లో పేర్కొంది.
అలాగే హెచ్సీఏ బాధ్యతలు బీసీసీఐకి అప్పగించాలనే కీలక డిమాండ్ చేసింది. ఇటీవల హెచ్సీఏలో జరిగిన పలు కార్యక్రమాల్లో అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం, పాలకవర్గాలపై అవినీతి ఆరోపణలు కొత్తగా ఏమీ కావు. ఈ నేపథ్యంలో సఫిల్గూడ క్రికెట్ క్లబ్ ఆర్థిక అక్రమాలపై విచారణకు అధికారికంగా పిలుపునిచ్చింది.
ఈ నెల 19న జరిగిన హెచ్సీఏ వార్షిక సమావేశాన్ని చెల్లదని ప్రకటించాలని కూడా పిటిషన్లో కోరింది. ఇదే సమయంలో అసోసియేషన్ కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటీవల అరెస్టయ్యారు. దీంతో వ్యవహారాలను చూస్తూ హైకోర్టు తాత్కాలికంగా బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి నవీన్ రావుకు అప్పగించింది.
ఈ మధ్యంతర ఉత్తర్వులు మూడు వారాల పాటు అమల్లో ఉండనున్నాయి. అప్పటివరకు హెచ్సీఏ నిర్వాహక బాధ్యతలన్నీ జస్టిస్ నవీన్ రావు చూడనున్నారు. మరోవైపు అసోసియేషన్ భవిష్యత్పై, అక్రమాలపై విచారణ మరింత వేగంగా సాగే అవకాశాలున్నాయి.
