
మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లు చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఫేక్ ఆధార్ కార్డ్ సృష్టించారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
బీజేపీ ఫిర్యాదు మేరకు సౌత్ రీజియన్ సైబర్ పోలీసులు రోహిత్ పవార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ, గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్), తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలపై ఐటీ చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
అక్టోబర్ 16న జరిగిన ప్రెస్ మీట్లో రోహిత్ పవార్ ఈ వివాదానికి తెరలేపారు. కేవలం 20 రూపాయలకే అనధికారిక వెబ్సైట్ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను ఎలా సృష్టించవచ్చో ఆయన బహిరంగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఫోటో, తన నియోజకవర్గ చిరునామాతో ఓ నమూనా కార్డును చూపించారు.
నకిలీ ఆధార్ కార్డులు ఎంత సులభంగా పుట్టుకొస్తున్నాయో, వ్యవస్థలోని లోపాలను బయటపెట్టేందుకే తాను ఇలా చేశానని రోహిత్ పవార్ సమర్థించుకున్నారు. ఈ నకిలీ కార్డుల ద్వారానే మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమంగా పేర్లు చేరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారం వెనుక బీజేపీ హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతను బీజేపీ ఆఫీస్ బేరర్ దేవాంగ్ డేవ్ చూస్తున్నారని, ఆయన ద్వారానే జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) నేతలు మండిపడుతున్నారు.
ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ, కేవలం నాలుగు రోజుల్లోనే (అక్టోబర్ 16-19) రాష్ట్ర ఓటర్ల జాబితాలో కొత్తగా 6.55 లక్షల ఓట్లు చేరాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఆరోపించడం ఈ రాజకీయ దుమారాన్ని మరింత పెంచింది.
