
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్సలెన్సీ అవార్డుల’ ప్రదానోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సరదా సంఘటనను పంచుకున్నారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 2009 నాటి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
2009 శాసనసభ ఎన్నికల తర్వాత, ఫలితాలకు నెల రోజుల సమయం ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి మరో ముగ్గురు మిత్రులతో కలిసి రామోజీరావును కలవడానికి ఫిలింసిటీకి వెళ్లారట. అప్పటికే తాము అధికారంలోకి వస్తున్నామనే ధీమాతో, మంత్రి పదవుల కోసం రామోజీరావుతో పైరవీ చేయించాలన్నది వారి ఉద్దేశం.
రేవంత్ రెడ్డి బృందాన్ని చూసిన రామోజీరావు, వారి చూపుల్లోనే విషయాన్ని పసిగట్టారట. కూర్చోబెట్టి, ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడిన తర్వాత, వాళ్లు అడగకముందే ఇలా అన్నారట: “నేనెప్పుడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పలేదు. నా దగ్గరకు వచ్చినా, ఎమ్మెల్యేలుగానే రాణించాలని సూచిస్తా. మీ నలుగురికీ అదే నా సూచన” అని రామోజీరావు చెప్పినట్లు రేవంత్ రెడ్డి నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసినా, రామోజీరావు తనకోసం ఎలాంటి పనులూ ప్రస్తావించలేదని రేవంత్ తెలిపారు.
2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి, అప్పట్లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవుతానని ఆశించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. ఇప్పుడు సీఎం హోదాలో ఆనాటి తన ‘పైరవీ’ ప్రయత్నాన్ని సరదాగా పంచుకోవడం విశేషం.
