
న్యూస్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న విలువే వేరు. సంపదకు చిహ్నంగా భావించే పసిడిని కొనుగోలు చేసేందుకు సామాన్యులే కాదు, దేశాల కేంద్ర బ్యాంకులు కూడా పోటీ పడుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ఈ విషయంలో ముందుంది.
యుద్ధాలు, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం వంటి ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల కారణంగా, కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను కాపాడుకోవడానికి బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. ఆర్బీఐ కూడా తన పసిడి నిల్వలను వేగంగా పెంచుకుంటోంది.
తాజా గణాంకాల ప్రకారం, ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 880 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈ భారీ నిల్వలతో, ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన దేశాల జాబితాలో భారత్ ఏడవ స్థానంలో నిలిచింది.
ఆర్బీఐ వద్ద ఉన్న ఈ 880 టన్నుల పసిడి మొత్తం విలువ సుమారు రూ. 8.36 లక్షల కోట్లు. ఆర్బీఐ కొనుగోళ్ల వేగం ఎంతలా ఉందంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే అదనంగా 600 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసింది.
ఈ జాబితాలో అమెరికా 8,133 టన్నులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జర్మనీ (3,351 టన్నులు), ఇటలీ (2,451 టన్నులు), ఫ్రాన్స్, చైనా, స్విట్జర్లాండ్ దేశాలు భారత్ కంటే ముందున్నాయి.
2024 నుంచి 2025 మధ్య కాలంలోనే బంగారం ధరలు 28% పెరిగాయి. ధరలు పెరుగుతున్నా, భవిష్యత్ భద్రత కోసం కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లను ఆపడం లేదు, పైగా మరింత పెంచుతున్నాయి.
