
గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత విమర్శలు, దాడులు పెరిగాయన్న విమర్శలు ఉన్నా, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాత్రం హుందాతనాన్ని కోరుకుంటున్నారు. జగన్ను ట్రోల్ చేస్తూ వచ్చిన ఒక ఏఐ వీడియోపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ నేతలు అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు.
అధికార పార్టీలో ఉన్న మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) ఒక కూటమిగా ఉన్నప్పుడు, మిగిలిన తమ ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని జగన్ ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా తాడేపల్లి ఆఫీసులో మీడియా ముందు విషయాలు వివరిస్తున్నారు.
ఈ సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, జగన్ ‘దయచేసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి’ అని ప్లకార్డు పట్టుకుని పరుగెత్తుతున్నట్టు ఒక ఏఐ జనరేటెడ్ వీడియో వైరల్ అయ్యింది.
ఈ ట్రోలింగ్పై లోకేశ్ స్పందించారు. ఇలాంటి కంటెంట్ వెనుక భావోద్వేగం ఉన్నప్పటికీ, వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కావని అన్నారు. తమ బహిరంగ ప్రసంగం ఎప్పుడూ గౌరవం మీద ఆధారపడి ఉండాలని తెలిపారు.
అసమ్మతిలోనూ మర్యాదను కాపాడుకుందామని లోకేశ్ టీడీపీ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత దాడులు కాకుండా, ఏపీని బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టిపెడదామని ఆయన సూచించారు.
