
న్యూస్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య ఫిట్నెస్పై పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. టెస్టులు ఆడేంత ఫిట్నెస్ షమీకి లేదని అగార్కర్ వ్యాఖ్యానించగా, షమీ రంజీ ట్రోఫీలో (2 మ్యాచ్ల్లో 15 వికెట్లు) సత్తా చాటుతూ సమాధానమిస్తున్నాడు.
తాను తిరిగి జట్టులోకి వచ్చేందుకు తహతహలాడుతున్నానని, తన పని రాణించడమేనని, సెలక్షన్ సెలక్టర్ల చేతుల్లో ఉందని షమీ అంటున్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో సెలక్షన్పై షమీ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి.
2023 వన్డే ప్రపంచకప్లో 24 వికెట్లతో హీరోగా నిలిచిన షమీ, ఆ తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. పునరాగమనంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్ టీ20 సిరీస్లలో ఆశించినంతగా రాణించలేకపోయాడు. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసినా, పాకిస్థాన్ వంటి కీలక మ్యాచ్లలో విఫలమయ్యాడు.
ఈ పేలవ ప్రదర్శన, వయసు (35), ఫిట్నెస్ను కారణంగా చూపుతూ సెలక్టర్లు అతన్ని పూర్తిగా పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్ టెస్టులకు, ఆసియా కప్కు, ప్రస్తుత ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు. అతని పేరును కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమవుతోంది.
నిజానికి, షమీ టెస్టులు ఆడి రెండేళ్లు దాటింది. ఇప్పుడు వన్డేల్లోనూ ఆస్ట్రేలియాకు ఎంపిక చేయలేదంటే, 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేనట్లే. ఇక టీ20 ఫార్మాట్లో ఐపీఎల్లో విఫలమవడంతో పాటు, సెలక్టర్లు యువ బౌలర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో, మూడు ఫార్మాట్లలోనూ షమీకి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. రంజీల్లో ఎంత రాణించినా, వయసు, ఫిట్నెస్ కారణాలతో సెలక్టర్లు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా షమీని పక్కన పెట్టినట్లేనని, అతన్ని మళ్లీ భారత జెర్సీలో చూసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
