
న్యూస్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో 234 సీట్లున్న నేపథ్యంలో, దక్షిణాదిలోనే అతిపెద్ద పోరాటం ఇక్కడే జరగనుంది.
ఇప్పటివరకు బీజేపీ తమిళనాడులో స్థిరమైన పట్టు సాధించలేకపోయింది. అన్నాడీఎంకేలో చీలికలు, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం వంటి ప్రయోగాలు ఫలించలేదు. అయితే తాజాగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం బీజేపీకి లాభం చేకూరుస్తుందా అన్న చర్చ మొదలైంది.
విజయ్ ప్రకటించిన తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ బీజేపీ, డీఎంకేలకు అతీతమని చెబుతున్నా, ఆయన అడుగులు బీజేపీ వ్యూహానికి దగ్గరగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ఓటు బ్యాంకు అయిన ద్రవిడ ఓట్లలో కొంత భాగం విజయ్ సొంతం చేసుకుంటే, అది చీలిక ఓట్ల వలన బీజేపీకి భవిష్యత్లో కీలకంగా మారవచ్చు.
విజయ్ తాజాగా ఇచ్చిన ప్రకటనల్లో కూడా డీఎంకేను నేరుగా టార్గెట్ చేస్తూ, బీజేపీ భావజాలంపై మాత్రమే విభేదం ఉందని పేర్కొనడం విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్థితి రేపు పొత్తులకు దారితీసే అవకాశం ఉందని తమిళ మీడియా అంచనా వేస్తోంది.
ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని డీఎంకే కూటమి, ఈ కొత్త రాజకీయ సమీకరణల నడుమ ఎంతవరకు నిలబడగలదో చూడాలి. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో కొత్త శక్తి సమీకరణాలు తప్పవని స్పష్టంగా కనిపిస్తోంది.
