
న్యూస్ డెస్క్: ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4 5 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన భారత్ రష్యా మధ్య జరగబోయే 23వ వార్షిక సదస్సు కోసం జరుగుతోంది. ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినా, రష్యాతో భారత్ స్నేహ బంధం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి ఈ పర్యటనే నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇద్దరు నాయకులు ముఖాముఖిగా కూర్చుని ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోనున్నారు. ‘స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధన అవసరాల గురించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ షెడ్యూల్లో రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవడం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందులో పాల్గొనడం ఉన్నాయి.
చాలా కాలం తర్వాత రష్యా అధినేత భారత గడ్డపై అడుగుపెడుతుండటంతో ఘన స్వాగతం పలకడానికి కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో భారత్ రష్యా బంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజుల పర్యటన డిసైడ్ చేయనుంది. ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకుంటారు.
