
న్యూస్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దీపావళి మరింత ప్రత్యేకం కానుంది. నరేంద్ర మోదీ సర్కార్ ఒకేసారి ఐదు శుభవార్తలు చెప్పి వారి ఇళ్లలో పండగ కాంతులను రెట్టింపు చేసింది. కరువు భత్యం పెంపు నుంచి బోనస్ల వరకు వరాల జల్లు కురిపించి, కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందించింది.
వీరిలో ప్రధానమైనది 3% కరువు భత్యం (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు. తాజా పెంపుతో మొత్తం డీఏ 58 శాతానికి చేరింది. జూలై 1 నుంచి ఇది వర్తించనుండటంతో, ఉద్యోగులకు బకాయిలతో కలిపి అక్టోబర్ నెల జీతంలో భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
దీంతో పాటు, నాన్-గెజిటెడ్ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు 30 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్గా ప్రకటించారు. పోస్టల్ ఉద్యోగులకు ఏకంగా 60 రోజుల వేతనం బోనస్గా లభించనుండటం విశేషం. గ్రామీణ్ డాక్ సేవకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) రేట్లను సవరించారు. అలాగే, కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ద్వారా మెరుగైన రిటైర్మెంట్, గ్రాట్యుటీ ప్రయోజనాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పెన్షనర్ల సౌకర్యార్థం, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ ప్రక్రియను కూడా సులభతరం చేశారు. అనారోగ్యంతో బాధపడేవారు, వికలాంగుల ఇంటికే వెళ్లి అధికారులు జీవన ప్రమాణ పత్రాలను స్వీకరించేలా వెసులుబాటు కల్పించారు.
మొత్తంగా, ఈ ఐదు కీలక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ దీపావళి పండుగను రెట్టింపు ఆనందం, ఆర్థిక భరోసాతో జరుపుకోనున్నారు. ఈ కానుకలు వారి సేవలకు ప్రభుత్వ గుర్తింపుగా నిలుస్తున్నాయి.
