
న్యూస్ డెస్క్: దేశంలో మావోయిస్టు సమస్యను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ “కగార్” ఫలితాలు ఇస్తోంది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో జరిగింది.
లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మందిపై రూ.64 లక్షల బహుమతి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు, పునరావాస విధానం ఫలితంగానే ఈ పరిణామం జరిగిందని అధికారులు తెలిపారు.
కేంద్రం చర్యలు, సెక్యూరిటీ బలగాల దాడులు మావోయిస్టులను కుదిపేస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్లో హతమైన తర్వాత ఉద్యమం మరింత బలహీనమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
లొంగిపోయిన వారిలో చాలామందికి గతంలో విధ్వంసక కార్యక్రమాల్లో పాత్ర ఉన్నప్పటికీ, హింస వదిలి సామాన్య జీవితంలోకి రావడమే లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారుల భరోసా లభించింది.
దండకారణ్యంలో బలగాల ఉనికి పెరగడంతో మావోయిస్టులు అడవులు వదిలి వస్తున్నారని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్లు వచ్చే మార్చి నాటికే మావోయిస్టులను పూర్తిగా అణచివేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, ఈ భారీ లొంగుబాటు మావోయిస్టుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తూ, ప్రభుత్వ వ్యూహం విజయవంతమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది.
