
న్యూస్ డెస్క్: వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక అనూహ్య ప్రతిపాదన అందింది. తాము ఆయుధాలను వీడటానికి సిద్ధంగా ఉన్నామని కోరుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ రాసింది.
స్పెషల్ జోనల్ కమిటీ అధికారి ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని వారు పేర్కొన్నారు.
అయితే, ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకోవడానికి, సహచరులను సంప్రదించడానికి తమకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మావోయిస్టు నేత అనంత్ ఆ లేఖలో కోరారు. ఈ గడువులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబోమని, తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
వాస్తవానికి, మావోయిస్టు పార్టీ మాజీ అధికారి ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ (సోను దాదా) గతంలోనే సాయుధ పోరాట విరమణకు ప్రతిపాదించారు. అయితే అప్పుడు పార్టీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినా, ప్రస్తుతం నేతల ఒత్తిడికి తలొగ్గినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టులపై ఉపిరి సలపకుండా ఒత్తిడి పెంచుతోంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల వల్ల మావోయిస్టు ఉద్యమం పూర్తిగా నీరసించిపోయింది.
ఈ పరిస్థితుల్లో మావోయిస్టులతో ఎలాంటి శాంతి చర్చలు ఉండవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇంతకుముందే ప్రకటించాయి. కేడర్ లీడర్లను భారీగా కోల్పోయిన తర్వాత వస్తున్న ఈ ప్రకటనను ప్రభుత్వం ‘బేషరతుగా లొంగిపోవడమే మార్గం’గా చూస్తోంది.
