
న్యూస్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హిడ్మాను పోలీసులు పట్టుకుని కాల్చేశారని ఆరోపించింది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట తాజాగా ఓ లేఖ మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
ఏపీలోని మారేడుమిల్లిలో నవంబరు 18న హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఆ నెల 15న హిడ్మాను అరెస్టు చేశారని, మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి 18న ఎన్కౌంటర్ చేసినట్లు ప్రకటించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
మావోయిస్టు పార్టీ వివరణ ప్రకారం.. అక్టోబరు 27న విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి ద్వారా వైద్యం కోసం హిడ్మా దండకారణ్యం నుంచి బయటకు వచ్చాడు. హిడ్మా వెళ్లిన తరువాత మరికొందరు విజయవాడ వెళ్లారని, ఈ సమాచారం తెలిసిన పోలీసులు నిరాయుధుడైన హిడ్మాను పట్టుకున్నారని మావోయిస్టు పార్టీ తెలిపింది.
ఎవరు కారణం:
గతనెల 9న పార్టీ నుంచి కోసాల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, అతనికి హిడ్మా సమాచారం తెలుసనని వికల్ప్ ఆ లేఖలో పేర్కొన్నారు.
- కోసాల్
- విజయవాడకు చెందిన కలప వ్యాపారి
- బిల్డర్-సివిల్ కాంట్రాక్టర్
- అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్
వీరంతా హిడ్మా ఎన్కౌంటర్ కు కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
దేవ్ జీ, రాజ్ రెడ్డి క్లారిటీ:
ఈ లేఖలో మావోయిస్టు అగ్రనేతలు దేవుజీ, రాజిరెడ్డిపై క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ పార్టీలో సురక్షితంగా ఉన్నట్లు వికల్ప్ వెల్లడించారు. దీంతో వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు జరిగిన ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది.
