
లెజెండరీ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ సినిమాలో లవ్ స్టోరీలను ఆయనంత అందంగా డీల్ చేసేవారు మరొకరు లేరని, అందుకే ఆయన్ను ‘లవ్ గురు’ అని పిలుస్తారు. ‘పొన్నియిన్ సెల్వన్’తో భారీ విజయం అందుకున్న ఆయన, ఇటీవల కమల్ హాసన్తో తీసిన ‘థగ్ లైఫ్‘ మాత్రం నిరాశపరిచింది.
దీంతో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మొదట శింబుతో ఓ సినిమా చేయాలని భావించినా, తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ రద్దయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన మరో స్టార్ హీరోతో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు.
ఆ హీరో మరెవరో కాదు, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి. మణిరత్నం, విజయ్ సేతుపతి ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
గతంలో 2018లో వీరిద్దరి కాంబినేషన్లో ‘చెక్క చివంత వానం’ (తెలుగులో ‘నవాబ్’) అనే భారీ మల్టీస్టారర్ వచ్చింది. అరవింద స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
ఇప్పుడు, ఆరేళ్ల విరామం తర్వాత, మణిరత్నం మళ్లీ సేతుపతి కోసమే ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు, విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘లైగర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరీకి ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.
