
తల్లిదండ్రులు తాము సాధించలేని ఎన్నో కలలను పిల్లల రూపంలో నెరవేర్చుకోవాలని ఆశిస్తారు. ఘట్టమనేని కుటుంబంలో ఇప్పుడు అదే జరగబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి అయిన మంజుల ఘట్టమనేని, తాను హీరోయిన్గా రాణించాలనే తన చిరకాల కలను ఇప్పుడు కుమార్తె జాహ్నవి ద్వారా సాకారం చేసుకోబోతున్నారు.
మంజుల 1990లలోనే నిర్మాతగా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మలయాళ, తమిళ చిత్రాలతో పాటు ‘షో’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరెంజ్’, ‘హంట్’ వంటి తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.
అయితే, నటనపై ఎంత ఫ్యాషన్ ఉన్నా, ఆమె హీరోయిన్గా స్టార్డమ్ అందుకోవాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు. కృష్ణ అభిమానుల అభీష్టం మేరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయారు.
ఇప్పుడు, తాను చేరుకోలేకపోయిన ఆ శిఖరాన్ని తన కుమార్తె జాహ్నవి ద్వారా అధిరోహించాలని మంజుల బలంగా కోరుకుంటున్నారు. అందుకే, జాహ్నవికి పదేళ్ల వయసులోనే, తాను దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో బాలనటిగా అవకాశం ఇచ్చి, నటనకు బీజం వేశారు.
ఆ చిన్న వయసులోనే తల్లి ప్రోత్సాహంతో జాహ్నవికి కూడా సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా తెరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం చిన్నప్పటి నుంచే మంజుల తన కుమార్తెకు నటన, నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
తల్లి హీరోయిన్ కావాలన్న కల, ఇప్పుడు కుమార్తె రూపంలో నెరవేరబోతుండటం ఘట్టమనేని కుటుంబంలో ఆనందాన్ని నింపుతోంది. మహేష్ బాబు మేనకోడలిగా, ఘట్టమనేని మూడో తరం వారసురాలిగా వస్తున్న జాహ్నవి, వెండితెరపై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
