
తెలంగాణ: శాసనసభలో దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. రాజకీయంగా వేరే పార్టీల్లో ఉన్నా, గోపీనాథ్ తనకు ఆత్మీయ మిత్రుడని గుర్తు చేసుకున్నారు.
“చూసేందుకు క్లాస్ లీడర్లా అనిపించినా, జూబ్లీహిల్స్ ప్రజలకు మాస్ నాయకుడే” అని ఆయన కొనియాడారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి, గోపీనాథ్ రాజకీయ ప్రారంభ దశలను సభలో వివరించారు. 1983లో తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైందని చెప్పారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్గా, జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పలు పదవులు చేపట్టారని గుర్తుచేశారు. వి
ద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర పోషించిన గోపీనాథ్, రాజకీయాలతో పాటు సినీ రంగంలోనూ నిర్మాతగా రాణించారని ఆయన తెలిపారు.
సినీ నిర్మాణంలో ఆయన చేసిన నాలుగు సినిమాలను రేవంత్ ప్రస్తావించారు. ‘పాతబస్తీ’, ‘రవన్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నా స్టైలే వేరు’ వంటి చిత్రాలతో గోపీనాథ్ సౌత్ ఇండస్ట్రీలో తన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఇది ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమని అన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం తన కుటుంబానికే కాకుండా, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని సీఎం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.
ఇక శాసనమండలిలో కూడా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు సభలు సంతాప తీర్మానాల అనంతరం వాయిదా పడ్డాయి. గోపీనాథ్ సేవలు, వ్యక్తిత్వం, అనుబంధం ఇవన్నీ నేతలు గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
