
కర్నూలు: చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు, ఓ బైక్ను ఢీకొట్టిన తర్వాత అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో బైకర్తో సహా 21 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం (తెలంగాణ వాసులకు) రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చాయి.
అయితే, ఈ ప్రమాదం వెనుక ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుపై ఇప్పటికే 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదై ఉన్నాయని, రూ. 23 వేల వరకు జరిమానాలు పెండింగ్లో ఉన్నాయని తేలింది.
అంతేకాదు, ఈ బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ ఏడాది మార్చి 31తోనే ముగిసిపోయింది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ల గడువు కూడా గతేడాది ఏప్రిల్లోనే పూర్తయినట్లు అధికారులు గుర్తించారు. ఇన్ని లోపాలున్న బస్సును రోడ్డెక్కించడమే పెద్ద నేరమని పలువురు మండిపడుతున్నారు.
ప్రమాదం జరిగిన తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ను ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ బస్సు ఆపకుండా కొంత దూరం లాక్కెళ్లడం వల్లే డీజిల్ ట్యాంక్కు మంటలు అంటుకున్నాయని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత డోర్లు తెరుచుకోకపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫిట్నెస్, ఇతర ధ్రువపత్రాలు లేని బస్సును నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడే అవకాశం ఉంది.
