
న్యూస్ డెస్క్: కర్నూలు జిల్లాలో 19 మందిని బలిగొన్న ఘోర బస్సు అగ్నిప్రమాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, వీ.కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. బస్సుకు ఫిట్నెస్ లేదని, పత్రాలన్నీ కాలం చెల్లాయని వస్తున్న ఆరోపణలను సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు ఖండించారు. తమ వద్ద అన్ని పత్రాలు చెల్లుబాటులోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రమాదంపై ఆయన వివరణ ఇస్తూ, వర్షంలో బైక్పై వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా బస్సు కింద పడిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. బైక్ డీజిల్ ట్యాంక్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ముందు డోర్ వద్ద వ్యాపించాయని, దీంతో ప్రయాణికులు వెనుక డోర్ నుంచి బయటపడ్డారని అన్నారు.
బస్సు పత్రాలపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ మార్చి 2027 వరకు, ఇన్సూరెన్స్ ఏప్రిల్ 2026 వరకు, రోడ్ ట్యాక్స్ మార్చి 2026 వరకు చెల్లుబాటులో ఉన్నాయని ఆయన తేదీలతో సహా వెల్లడించారు. తమ సంస్థలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
అయితే, యజమాని వాదనకు పూర్తి భిన్నంగా రవాణా శాఖ రికార్డులు ఉన్నాయి. ప్రమాదానికి గురైన బస్సు గత 21 నెలల్లో (జనవరి 2024 – అక్టోబర్ 2025) ఏకంగా 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ. 23,120 విలువైన చలాన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.
ఈ ఉల్లంఘనలలో 9 సార్లు నో-ఎంట్రీ జోన్లోకి వెళ్లడం, మితిమీరిన వేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటివి ఉన్నాయి. ఇది డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని, యాజమాన్యం పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తోంది.
ఒకవైపు యజమాని పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయని చెబుతుంటే, మరోవైపు ఇన్ని ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
