
న్యూస్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ పేరుతో ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు మళ్లించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “ఇది కేవలం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకున్న దాడి కాదు. తెలంగాణ జీవనాడిని ఎండబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం ప్రధాన ఉద్దేశం” అని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు, కేంద్ర బీజేపీ కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సీబీఐను ఇంతవరకు వ్యతిరేకించిన సీఎం రేవంత్ ఒక్కరోజులోనే మాట మార్చడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. “దీనికి వెనుక ఉన్న శక్తులు ఎవరో ప్రజలకు తెలియాలి” అని అన్నారు. విచారణలు తమకు కొత్త కావని, ఏ ఏజెన్సీకి ఎదురయ్యినా వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
“రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, ఈ కుట్రలను ప్రజల ముందు ఎండగడతాం” అని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో కాళేశ్వరం అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.
