
న్యూస్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.
విచారణకు మంత్రి సురేఖ గైర్హాజరుపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ ఎన్బీడబ్ల్యూ జారీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు.
గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ తో పాటు సున్నితమైన అంశాల్లో కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవని, తన పరువుకు నష్టం కలిగించాయని కేటీఆర్ వాదించారు.
ఇదే విషయంపై సినీ నటుడు నాగార్జున కూడా కేసు వేశారు. అయితే ఆయనకు క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కేసు ఉపసంహరించుకున్నారు. కానీ కేటీఆర్ పై చేసిన ఆరోపణలను మాత్రం వెనక్కి తీసుకోబోనని సురేఖ గతంలోనే ప్రకటించారు.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గతంలో కోర్టు సూచించింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు మంత్రి సురేఖ న్యాయపరంగా ఏం చేయనున్నారు, ఈ పరిస్థితిని ఆమె తరఫు న్యాయవాదులు ఎలా హ్యాండిల్ చేస్తారన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. కోర్టుకు సరైన వివరణ ఇచ్చి త్వరలోనే ఆమె ఉపశమనం పొందాల్సి ఉంటుంది.
