
తెలంగాణ: కాంగ్రెస్లో మరో కొత్త చర్చ మొదలైంది. సొంత శాఖపైనే మంత్రికి పట్టులేదా? నిర్ణయాలన్నీ ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన వ్యవహార శైలి, తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా మంగళవారం జరిగిన సినీ ఆర్టిస్టుల అభినందన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే, సంబంధిత శాఖ మంత్రి అయిన కోమటిరెడ్డికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని ఆయన అనుచరుల వర్గం వాపోతోంది. ఇది ఆయన అలకకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అంతేకాకుండా, అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ధరల పెంపు లాభాల్లో 20% కార్మికులకు ఇవ్వాలని సంచలన ప్రతిపాదన చేశారు. ఈ కీలక విధానపరమైన నిర్ణయం కూడా తన దృష్టికి రాలేదని మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
నిజానికి, ఆయనను పక్కన పెడుతున్నారనే వాదనకు గత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. గతంలో సినిమా టికెట్ల వివాదంపై స్పందిస్తూ, “మాలాంటోళ్లు మాట్లాడితే ఇబ్బంది, అందుకే గమ్మున ఉంటున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో, “నాకేం తెలుసు, వాళ్లనే అడగండి” అంటూ ఆయన సమాధానం దాటవేయడం ఆయన అసహనాన్ని సూచిస్తోంది.
సొంత శాఖలో తన ప్రమేయం లేకుండానే సీఎం కార్యాలయం నేరుగా నిర్ణయాలు తీసుకోవడంపై కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన అలిగారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తాయేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
