న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న సమ్మిట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి అమరావతికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
జగన్కు మిత్రుడిగా తాను సలహా ఇస్తున్నానని, చట్ట సభలే అసలైన వేదిక అని కోమటి రెడ్డి అన్నారు. అక్కడ నుంచే ఏ అంశం అయినా ఎత్తి ప్రజా సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనవచ్చునని ఆయన చెప్పారు. ఈ విషయంలో జగన్ ఆలోచన చేయాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి తరువాత విపక్ష నేతకే ఏ రాష్ట్రంలో అయినా అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తాము తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా బీఆర్ఎస్ మీద అలుపెరగని పోరాటం చేశామని ఆయన గుర్తు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి చంద్రబాబు విజన్ కి హైదరాబాద్ ప్రతిరూపం అని పొగిడేశారు. బాబు విజనరీ అంటూ హైదరాబాద్ కి ఆయన ఎంతో మేలు చేశారని చెప్పడం గమనార్హం.
మంత్రి కోమటిరెడ్డి ఈ మధ్యనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. అయితే ఏపీ మీడియాతో మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల వల్లనే తాను అలా మాట్లాడాను అన్నారు.
కోమటిరెడ్డి ఏపీ తెలంగాణా ప్రజలు అంతా ఒక్కటిగా ఉండాలని కోరుకున్నారు. మొత్తానికి ఆయన చేసిన ప్రకటనలు కూటమికి ఖుషీగా ఉండగా, వైసీపీకి జగన్కు కొంత ఇరకాటంగా మారాయి.
