హైదరాబాద్: ఇందిరాపార్క్లో జరిగిన మహాధర్నాలో ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో కేసీఆర్ది ఒక భాగం మాత్రమేనని, ఆయన వల్లే రాష్ట్రం వచ్చిందన్న వాదనను అంగీకరించలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు చేసిన త్యాగాలే ప్రధాన బలమని గుర్తు చేశారు.
కోదండరాం మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో ఉద్యమకారులు నోరు విప్పలేక భయాందోళనలో ఉన్నారని విమర్శించారు. ఉద్యమకారుల డిమాండ్లను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని ఉద్యమ సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 15న జన సమితి కార్యాలయంలో ఉద్యమ సంఘాలతో సమావేశం జరపనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో భవిష్యత్ దిశపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మాట్లాడి, తెలంగాణ ఒక్కరితో వచ్చిన రాష్ట్రం కాదని, సమష్టి పోరాటాల ఫలితమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులు నిర్లక్ష్యం పాలయ్యారని ఆరోపించారు.
సౌత్ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గాలి వినోద్కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ, 500 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక సిద్ధం చేసామని తెలిపారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.
