
న్యూస్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. రాయచోటిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ, ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలు తార్కికం కాదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2014లో బీజేపీ 282 సీట్లు, 2019లో 303 సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. రిగ్గింగ్ జరిగి ఉంటే 2024లో 400కు పైగా సీట్లు రావాలని, కానీ 240 మాత్రమే వచ్చాయని ప్రశ్నించారు.
ఒకే రోజు ఎన్నికల ఉదాహరణగా 2009 ఏపీ ఫలితాలను ప్రస్తావించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ 156 సీట్లు గెలిచినా, పార్లమెంట్లో 33 మాత్రమే రావడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో సహజమని, రిగ్గింగ్ కాదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్ధం కాకపోతున్నాయని ఆయన విమర్శించారు. పెద్దగా ఆర్భాటంగా మొదలుపెట్టి, చివరికి తుస్సుమనిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలు చాలా తెలివైనవారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇస్తారని, దానిని అంగీకరించాల్సిందేనన్నారు.
“కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకపోతే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి” అని రాహుల్ గాంధీకి సలహా ఇస్తూ తన వ్యాఖ్యలను ముగించారు.
