
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్‘. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా నష్టాలు మిగిల్చిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు.
తన తదుపరి చిత్రం ‘మాస్ జాతర’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ ‘కింగ్డమ్’ ఫలితంపై మాట్లాడారు. ఈ సినిమా డిజాస్టర్ కాదని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టిందని ఆయన తెలిపారు. అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయినా, దీన్ని ఫెయిల్యూర్గా పరిగణించకూడదని అన్నారు.
విజయ్ దేవరకొండ గత చిత్రాలైన ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ కంటే ‘కింగ్డమ్’ మెరుగ్గానే వసూలు చేసిందని నాగవంశీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సత్తా చాటిందని, నార్త్ అమెరికాలో ప్రీమియర్లతో కలిపి 1.8 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని వెల్లడించారు.
నైజాం ఏరియాలోనూ సినిమా స్టడీగా ఆడిందని, దాదాపు రూ. 11 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. జీఎస్టీ సర్దుబాట్ల తర్వాత చాలా వరకు బయర్లు సేఫ్ జోన్లోకి వచ్చారని, కొద్ది మంది మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశారని వివరించారు.
చాలా ప్రాంతాల్లో 70% పైగా రికవరీ జరిగిందని, కొన్ని చోట్ల 80-90% వరకు వసూళ్లు వచ్చాయని నాగవంశీ లెక్కలతో సహా చెప్పారు. వసూళ్ల పరంగా చూసుకుంటే ‘కింగ్డమ్’ కచ్చితంగా యావరేజ్ కంటే ఎక్కువ రేంజ్ సినిమా అని, ఫ్లాప్ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఫలితంపై వస్తున్న నెగటివ్ ప్రచారానికి ఆయన ఈ క్లారిటీతో చెక్ పెట్టినట్లయింది.
