
న్యూస్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానం కోసం పోరు ఆసక్తికరంగా మారింది. అయితే, అసలైన హీట్ మాత్రం సర్వే రాయుళ్లతో మొదలైంది.
స్థానికులు కాని, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలు పొద్దునే ఇళ్ల వద్ద బెల్స్ నొక్కుతూ, ‘‘కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ పాలన బాగుందా?’’ అని అడుగుతున్నారు. చేతిలో ట్యాబ్ పట్టుకుని సమాధానాలు రికార్డ్ చేస్తూ ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ప్రజల నాడిని పట్టుకోవడమే లక్ష్యంగా కొన్ని సర్వేలు ప్రొఫెషనల్స్ చేస్తుంటే, కొన్ని మాత్రం పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే అనుమానం ఉంది. ఉప ఎన్నికలకు సర్వేల సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి అని పరిశీలకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను తమ పాలనకు రిఫరెండం అని భావిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ మీద ప్రజల నమ్మకం ఇంకా ఉందని చూపించేందుకు ఇదే వేదికగా చూస్తోంది. ఇరుపార్టీలు సొంతంగా సర్వేలు చేయిస్తున్నాయి.
ఓటర్ల లెక్కలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అన్నీ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్న అంశాలుగా భావిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్లో ప్రతి ఇంటి అభిప్రాయం విలువైనదిగా మారింది.
ప్రస్తుతానికి, సర్వేల ఫలితాలు ఎంతవరకు నిజమో చెప్పడం కష్టం. కానీ ఉప ఎన్నిక దగ్గరపడే కొద్దీ కేసీఆర్-రేవంత్ పాలనలపై చర్చ మరింత వేడెక్కడం ఖాయం.
