
న్యూస్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై విమర్శలు చేస్తున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ, కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ప్రధానంగా టార్గెట్ చేశారు.
కృష్ణారావు చేసిన భూ ఆక్రమణలపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఐడీపీఎల్ భూములను కబ్జా చేశారని, ఆయన కుమారుడి కంపెనీలు కట్టిన విల్లాలు కూడా కబ్జా భూముల్లోనే ఉన్నాయని తెలిపారు. చెరువును డెవలప్మెంట్ పేరుతో మింగేశారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరారు.
తనపై కాంగ్రెస్ తో జతకట్టాననే ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, టీ న్యూస్ ఛానెల్కు కవిత లీగల్ నోటీసులు పంపారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని తెలిపారు.
మాధవరం చిన్న వ్యక్తి అని, అసలు ఆయన వెనుక ఉన్నది గుంటనక్క అని కవిత వ్యాఖ్యానించారు. తనపై, తన భర్తపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా తండ్రి కేసీఆర్ ను ఒక్క సాయమైనా అడగలేదని కవిత చెప్పారు. తనకు వ్యాపారాలు లేవని, ఎవరీతోనూ అవగాహన లేదని స్పష్టం చేశారు. దేవుడి దయతో తాను సీఎం అవుతానని పేర్కొన్న కవిత, 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్యాయాలన్నిటిని వెలికితీస్తానని ప్రకటించారు.
