
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన రిపోర్టులో ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతున్నట్లు వెల్లడైంది.
మొత్తంగా దేశంలో హెచ్ఐవీ వ్యాప్తి కేసులు తగ్గినప్పటికీ, ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
ఐటీ రంగంలో హెచ్ఐవీ కేసులు పెరుగుదలకు కారణం విదేశీ జీవనశైలిని అనుసరించటమని నివేదిక చెబుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరించడం ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కువమందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్ మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడటం లాంటివి హెచ్ఐవీ వ్యాప్తికి కారణమవుతున్నాయి.
గర్భం రాకుండా ఉండేందుకు అందుబాటులోకి వచ్చిన తక్షణ గర్భనిరోధక మాత్రల కారణంగా అరక్షిత శృంగారం ఎక్కువైందని విశ్లేషణలు చెబుతున్నాయి. కండోమ్ వాడకం తగ్గడం వల్ల ఈ ముప్పు పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ రంగానికి చెందిన వారికి హెచ్ఐవీ పరీక్షల సంఖ్య పెంచాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
