
న్యూస్ డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ శాంతి ఒప్పందం కింద విడుదలైన 20 మంది బందీలలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఇజ్రాయెల్ అంతటా తీవ్ర ఆందోళనను పెంచింది.
బందీల కుటుంబ సభ్యులు “మా తల్లులు, భార్యలు, కుమార్తెలు ఎక్కడ?” అంటూ రోడ్లపై నిరసనకు దిగారు. ఒకవైపు బందీల విడుదలతో కలిగిన సంతోషం, మరోవైపు మహిళల జాడ తెలియకపోవడంతో ఇజ్రాయెల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఈ పరిణామం గాజా పీస్ ప్లాన్ ఉద్దేశంపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. రెడ్క్రాస్ సంస్థ కూడా ఇంకా బందీలు హమాస్ ఆధీనంలో ఉన్నారనే సంకేతాలు ఉన్నాయని వెల్లడించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, హమాస్ మహిళా బందీలను “చర్చల పావులుగా” ఉపయోగించే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ ప్రధాని తరపున కూడా ఈ అంశంపై తీవ్ర స్పందన వెలువడింది. “మా మహిళలు, పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే వరకు మేము ఆగము. హమాస్ కపట నాటకాలు ఆడుతోంది. ఇది నిజమైన శాంతి కాదు” అని ప్రకటన వెలువడింది. ఈ అంశం ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోంది.
హమాస్ తమ చెరలో ఉన్న వారందరినీ విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఈ ప్రకటనను నమ్మడం లేదు. 2023 అక్టోబర్ 7 దాడిలో పలువురు మహిళలు, బాలికలు హమాస్ చేతికి చిక్కినట్లు స్పష్టమైన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని ఇజ్రాయెల్ గట్టిగా వాదిస్తోంది.
2023 దాడుల్లో మహిళలపై లైంగిక హింస జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచించాయి. ఈ నేరాలకు మహిళా బందీలు ప్రత్యక్ష సాక్షులు కావచ్చని, అందుకే హమాస్ వారిని “యుద్ధ నేరాలకు సంబంధించిన కీలక సాక్షులు”గా ఉంచుకుందని ఇజ్రాయెల్ మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి. గతంలో విడుదలైన మహిళా బందీల మాదిరిగా కాకుండా, తాజా విడుదలలో మహిళలు లేకపోవడం ఆందోళనను పెంచింది.
