
న్యూస్ డెస్క్: అమెరికాలో మొబైల్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడు భారత్ వేగంగా దూసుకెళ్తోంది. గత ఏడాది కూడా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లకు అక్కడ మంచి ఆదరణ ఉన్నా, ఈసారి దాని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో భారత్ నుండి 21.3 మిలియన్ యూనిట్ల ఫోన్లు ఎగుమతి కావడం, మార్కెట్ వాటా 36 శాతానికి చేరుకోవడం విశేషం.
ఇదే సమయంలో చైనా నుంచి ఫోన్ల దిగుమతులు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 11 శాతంగా ఉన్న భారత్ వాటా, ఇప్పుడు మూడు రెట్లు పెరగడం చైనాకు షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన దిగుమతులు 27 శాతం తగ్గాయి. ప్రస్తుతానికి చైనా తొలి స్థానంలో ఉన్నా, భారత్ మళ్లీ దగ్గరగా వచ్చింది. వియత్నాం మూడో స్థానంలో ఉంది.
ఈ మార్కెట్లో ఎక్కువగా యాపిల్ ఫోన్లే ఎగుమతి అవుతున్నాయి. గతంలో చైనాపైనే ఆధారపడిన యాపిల్, ఇప్పుడు భారత తయారీపై ఆసక్తి చూపుతోంది. భారత్ ప్రభుత్వ పిఎల్ఐ పథకం ఇందుకు ప్రధాన కారణం. ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ సంస్థలు ఇప్పుడు భారత మార్కెట్ను విస్తరిస్తున్నాయి.
తాజాగా ఫాక్స్కాన్ తమిళనాడులో పెట్టుబడులు పెంచడంతో, మరిన్ని ఫోన్లు భారత్ నుంచి అమెరికాకు వెళ్లే అవకాశముంది. యాపిల్ ప్రో మోడళ్లను కూడా భారత్లో తయారు చేయడం గమనార్హం.
ఒకవేళ ఇదే పద్దతి కొనసాగితే త్వరలో భారత్ అమెరికా మార్కెట్ను ఆధిపత్యంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
