
న్యూస్ డెస్క్: కెనడాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆగడాలు శృతిమించుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి (66) దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య తామే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
సోమవారం అబోట్స్ఫోర్డ్లోని తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న సహాసిపై మరో కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ హత్యకు తామే బాధ్యులమని గ్యాంగ్ సభ్యుడు గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సహాసి మాదకద్రవ్యాల వ్యాపారంలో భాగస్వామి అని, డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వనందుకే చంపామని ధిల్లాన్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. 1991లో కెనడా వలస వెళ్లిన సహాసి, కష్టపడి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
ఇదే గ్యాంగ్ ఇటీవల పంజాబీ గాయకుడు చాని నట్టన్ ఇంటిపైనా కాల్పులకు పాల్పడింది. మరో వ్యక్తితో ఉన్న శత్రుత్వం కారణంగానే నట్టన్ను టార్గెట్ చేశామని, అతనితో పనిచేసే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించింది.
హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఇటీవల ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ వరుస దాడులతో కెనడాలోని భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
