
ఇమ్రాన్ను దేశం వదిలిపోమంటూ ఒత్తిడి.. తెరపైకి సంచలన విషయం!
పాకిస్థాన్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వచ్చిన పుకార్లకు తెరపడింది. ఆయన క్షేమంగా ఉన్నారని పీటీఐ సెనేటర్ ఖుర్రం జీషన్ తాజాగా ధృవీకరించారు. అయితే, ఈ మరణవార్తల వెనుక సంచలన విషయం ఉందని జీషన్ తెలిపారు.
పాకిస్థాన్ విడిచి వెళ్లాలని ఆయనపై ప్రభుత్వం బలవంతంగా ఒత్తిడి తెస్తోందని జీషన్ ఆరోపించారు. ఈ ఒత్తిడికి తలొగ్గేలా చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగానే ఇమ్రాన్ను ఒంటరిగా ఉంచుతున్నారని చెప్పారు.
గత నెల రోజులుగా ఆయన కుటుంబం, న్యాయవాదులు పార్టీ నాయకులను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ వల్ల ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని భావిస్తున్నందున ఈ చర్యలు తీసుకుంటున్నారు.
విదేశాలకు వెళ్లి తనకు నచ్చిన ప్రదేశంలో మౌనంగా ఉంటే రాయితీలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జీషన్ వివరించారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ ఆ షరతుకు ఎప్పటికీ అంగీకరించబోడని జీషన్ స్పష్టం చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ పాకిస్థాన్లో ఖాన్ ప్రభావం బలంగా ఉందని, యువతలో పీటీఐకి విస్తృత మద్దతు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ మౌనంగా విదేశాలకు వెళ్తేనే రాయితీలు దక్కుతాయి. కానీ, ఆయన రాజకీయ పోరాటాన్ని ఆపకపోతే ఈ ఉత్కంఠ కొనసాగడం ఖాయమని తెలుస్తోంది.
