
న్యూస్ డెస్క్: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ఏఐ మరో అడుగు ముందుకేసింది. తాజాగా విడుదల చేసిన అత్యాధునిక మోడల్ ‘GPT-5’ టెక్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. వినియోగదారులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చినందుకు టెక్ రంగం ఆశ్చర్యానికి గురైంది.
ఈ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు “ఓపెన్ఏఐ.. మైక్రోసాఫ్ట్ను బతికుండగానే మింగేస్తుంది” అంటూ షాకింగ్ హెచ్చరిక చేశారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెద్ద భాగస్వామిగా ఉన్నా, మస్క్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జీపీటీ-5 గురించి ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, ఇది ఒక పీహెచ్డీ నిపుణుడితో సమానమని చెప్పారు. చాలా క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలదని తెలిపారు. ఏజీఐ దిశగా ఇది పెద్ద అడుగు అని పేర్కొన్నారు.
మస్క్ హెచ్చరికపై సత్య నాదెళ్ల హుందాగా స్పందించారు. “ఇలాంటి పోటీలు టెక్ రంగంలో సహజం. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, భాగస్వామ్యాలు, పోటీ కొనసాగుతూనే ఉంటాయి” అని అన్నారు. జీపీటీ-5ని మైక్రోసాఫ్ట్ 365, గిట్హబ్, అజూర్ ఫౌండ్రీ వంటి సేవల్లో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, మస్క్ తన సొంత గ్రాక్ ఏఐ ప్లాట్ఫామ్ను ప్రశంసిస్తూ, పోటీ ఇంకా ఉత్కంఠభరితంగా మారిందని తెలిపారు. ఓపెన్ఏఐ జీపీటీ-5 ఉచిత విడుదలతో ఏఐ రంగంలో పోటీ మరింత పెరిగింది.
