
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏడాది క్రితం అమెరికా సంక్షోభాల్లో ఉందని, కానీ తన పాలనలోనే స్వర్ణయుగం మొదలైందని అన్నారు.
కేవలం ఏడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను ఆపానని, అందులో భారత్-పాకిస్థాన్ వివాదం కూడా ఒకటని ట్రంప్ తెలిపారు.
ఆయన పేర్కొన్న యుద్ధాల్లో ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్, రువాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్బైజాన్, ఈజిప్టు-ఇథియోపియా, సెర్బియా-కొసావో మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ యుద్ధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, వాటిని తాను ఆపగలిగానని ట్రంప్ హైలైట్ చేశారు.
ఐరాస మాత్రం ఇలాంటి వివాదాలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. “ఐరాస నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. నేను ఆ యుద్ధాలను ఆపినందుకు నోబెల్ బహుమతి రావాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చకు దారి తీసాయి.
భారత్, చైనాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి ఈ రెండు దేశాలే కారణమని, చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ రష్యాకు బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో యూరప్, నాటో దేశాలు విఫలమయ్యాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
