
న్యూస్ డెస్క్: పార్టీ ఫిరాయింపు పిటిషన్పై అనర్హత వేటు పడకముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వెంటనే ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే దానం రాజీనామాకు ఒక షరతు పెట్టారు. తాను రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకే కేటాయించాలనే హామీని అధిష్ఠానం నుంచి ఆశిస్తున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా నడవాలని భావిస్తున్నట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం, రేవంత్ రెడ్డి సీఎం కాగానే కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.
తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ చర్యలు వేగవంతం చేసే అవకాశం ఉంది. అనర్హత వేటు వేయించుకునే బదులు, గౌరవంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలన్న వ్యూహంలోనే దానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను బరిలోకి దిగితే గెలుపు ఖాయమన్న ధీమాను దానం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్లో దానంకు మించిన బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మరొకరు లేరని భావిస్తున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం దానం రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఖైరతాబాద్లో బలమైన నేతలు లేని బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరిని నిలబెడుతుందనేది సస్పెన్స్.
