
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసుల మెట్లెక్కారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కొందరు వ్యక్తులు తన పేరు, ఫోటోలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సదరు ‘ఎక్స్’ హ్యాండిల్స్ వివరాలను పోలీసులకు అందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజానికి, కొద్ది రోజుల క్రితమే చిరంజీవి ఇదే సమస్యపై సీపీ సజ్జనార్ను, సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వాయిస్ను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలు, వాయిస్ను వాడితే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేసింది.
సీపీ సజ్జనార్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ, తాజాగా మళ్లీ కొందరు వ్యక్తులు చిరంజీవిని టార్గెట్ చేస్తూ ‘ఎక్స్’లో దూషణలకు దిగడం గమనార్హం. కోర్టు ఆదేశాలున్నా వేధింపులు ఆగకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ సమస్య కేవలం చిరంజీవికే పరిమితం కాలేదు. మోహన్ బాబు, నాగార్జున వంటి టాలీవుడ్ స్టార్లు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తున్నారని, AI టెక్నాలజీతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అక్కడ కోర్టులు సెలబ్రిటీల హక్కులకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. కానీ, చిరంజీవి విషయంలో మాత్రం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి వేధింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తాజా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
