
న్యూస్ డెస్క్: భారత్-చైనా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తన పాత రాజకీయ వైఖరిని మరోసారి బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళ పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్కు షాంఘై విమానాశ్రయంలో చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఘోర అవమానం ఎదురైంది.
నవంబర్ 21న లండన్ నుంచి జపాన్కు వెళుతున్న పెమా ప్రయాణ విమానం ట్రాన్సిట్ కోసం షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆమె పాస్పోర్ట్ను తనిఖీ చేసిన అధికారులు, “అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందింది కాబట్టి ఈ పాస్పోర్ట్ చెల్లదు” అంటూ నిలదీశారు.
చైనీస్ సిబ్బంది ఆమెను చూసి నవ్వుతూ, “చైనీస్ పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోమని” హేళన చేసినట్లు పెమా మీడియాకు వెల్లడించారు. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, ఆమెను జపాన్కు వెళ్లే తదుపరి విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నారు.
అధికారులు ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని, ట్రాన్సిట్ ప్రాంతానికి పరిమితం చేశారు. దీంతో ఇరుకున పడిన పెమా, యునైటెడ్ కింగ్డమ్లోని స్నేహితురాలి ద్వారా భారత కాన్సులేట్ను సంప్రదించారు.
భారత దౌత్యాధికారులు వెంటనే ఈ వివాదంలో జోక్యం చేసుకున్న తర్వాతే ఆమెపై విధించిన నియంత్రణ ఎత్తివేయబడింది. ఈ అవమానకర సంఘటనపై పెమా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అరుణాచల్ ప్రజల గౌరవాన్ని, భారత సార్వభౌమత్వాన్ని అవమానించే చర్య ఇది. అరుణాచల్ తమ భూభాగమనే చైనా వివాదాస్పద వైఖరికి ఈ ఘటన నిదర్శనం.
