
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం చేనేత కార్మికులకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో, నేతన్నలకు 50 ఏళ్ల వయసులోనే పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు.
చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే నేతన్నల భద్రతకోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
చేనేత రంగానికి భారతీయ సంప్రదాయంలో ఉన్న విశిష్టతను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో, చేనేత వస్త్రాల వైభవాన్ని తెలియజేసే మ్యూజియాన్ని అమరావతిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగంగా చేనేతను అభివర్ణించారు.
గతంలోనే వేలాది మంది కార్మికులకు రుణాలు, విద్యుత్ సౌకర్యాలు కల్పించినట్లు గుర్తు చేశారు. మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం 50% సబ్సిడీతో రూ.80 కోట్లు కేటాయించనుందని, ఈ నెల నుంచే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలతో రాష్ట్రవ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
