
న్యూస్ డెస్క్: ఫస్ట్ నైట్ అంటే కొత్త జంట ఎంతో ఆశగా ఎదురుచూసే క్షణం. పాల గ్లాస్, పూల అలంకరణలతో గదిని రెడీ చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ వరుడికి మాత్రం శోభనం రాత్రి హారర్ సినిమాను తలపించింది. గదిలోకి సిగ్గుపడుతూ రావాల్సిన వధువు, చేతిలో పదునైన కత్తితో ఎంట్రీ ఇచ్చింది. అది చూసి వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
గదిలోకి వచ్చిన వెంటనే ఆమె చేసిన వార్నింగ్ వరుడికి చెమటలు పట్టించింది. “నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. నేను వేరే ఒకరిని ప్రేమిస్తున్నా” అంటూ గట్టిగా హెచ్చరించింది. ఆమె చేతిలోని కత్తి, కళ్ళలోని కోపం చూసి వరుడు గజగజ వణికిపోయాడు. అలా ఆ రాత్రి ఒక్కటే కాదు, వరుసగా మూడు రాత్రులు ప్రాణభయంతో ఆ గదిలోనే నరకం చూశాడు.
చివరికి ధైర్యం చేసి వరుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. పంచాయితీ పెడితే, ఆ వధువు ఓపెన్గానే తనకు అమన్ అనే వ్యక్తి అంటే ఇష్టమని, ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు కుటుంబాలు కంగుతిన్నాయి. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
పెద్దలు సమస్యను పరిష్కరించే లోపే వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాత్రికి రాత్రే ఇంటి వెనుక గోడ దూకి, తన ప్రియుడు అమన్తో కలిసి జంప్ అయిపోయింది. ఉదయం లేచి చూసేసరికి కోడలు కనిపించకపోవడంతో అత్తింటి వారు లబోదిబోమన్నారు.
ప్రస్తుతం నైనీ ఏరియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పెళ్లికి ముందే ప్రేమ విషయం చెప్పకుండా, తాళి కట్టించుకున్నాక ఇలా కత్తితో బెదిరించి పారిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పాపం ఆ వరుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా, వధువు తన ప్రియుడితో చెక్కేసింది.
