
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేరతారనే వార్తలు వైరల్ గా అ విషయంపై బీజేపీ కీలక నేత స్పందించారు. అవినీతికి పాల్పడిన వారిని చేర్చుకోవడం జరగదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
కవిత సస్పెన్షన్తో బీఆర్ఎస్ పతనం మొదలైందని, త్వరలోనే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడతారని ఆయన అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్రావు, అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబంలో వాటాల పంపకాల గొడవలే కవిత సస్పెన్షన్కు కారణమని ఆరోపించారు. ఈ పరిణామం బీఆర్ఎస్లో అవినీతి బట్టబయలైందని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 20 నెలలుగా విచారణను ఆలస్యం చేయడం నిందితులకు ఆధారాలు తారుమారు చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని, దీంతో నిజాలు వెలుగులోకి రాలేదని మండిపడ్డారు.
అలాగే, సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం ఒత్తిడికి లోనవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ “పరిపాలన దినోత్సవం” అంటూ మాయమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
