
న్యూస్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది తుపానుగా మారితే దీనికి “దిట్వా” అని నామకరణం చేస్తారు. ఈ పరిణామంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక జలాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం నవంబర్ 26 రాత్రి వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకలోని హంబన్ టోటకి 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
‘దిట్వా’ అనే పేరును యెమెన్ ప్రతిపాదించింది. యెమెన్ లోని సోకోట్రా ద్వీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఆధారంగా ఈ తుపానుకు నామకరణం చేశారు. డెట్వా అని కూడా దీనిని పిలుస్తారు.
ఈ కొత్త వాతావరణ వ్యవస్థ గురువారం మధ్యాహ్నం తర్వాత తదుపరి 48 గంటల్లో శ్రీలంక తీరం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో శని, ఆది, సోమ వారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనికి సమాంతరంగా కదిలిన సెన్యార్ తుపాను ఈశాన్య ఇండోనేషియాపై కేంద్రీకృతమై ఉంది.
