
న్యూస్ డెస్క్: అమరావతిలో ఆరోగ్య రంగానికి కొత్త రూట్ మొదలవుతోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బాలకృష్ణ స్వయంగా పరిశీలించారు.
శనివారం బాలకృష్ణతో పాటు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు లాంటి సన్నిహితులు కూడా అమరావతిలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికలను వివరించారు.
ఈ ఆసుపత్రిని మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో విస్తరించడమంటే ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఇక తన చిత్రం భగవంత్ కేసరికు జాతీయ అవార్డు రావడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతపై తీసిన సినిమాకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు బాలకృష్ణ తెలిపారు. కొత్త పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
