
న్యూస్ డెస్క్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా మార్టూరు యువకుడు పతిబండ్ల లోకేశ్ (23) దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 3న జరిగిన ఈత కొలనులో ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కుటుంబంలో, స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
లోకేశ్, మార్టూరు గ్రామానికి చెందిన వ్యాపారి వేణుబాబు కుమారుడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి, ఎనిమిది నెలలుగా ఉద్యోగం చేస్తున్న ఆయన మరణం అందరినీ కుదిపేసింది. ఈతలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందో తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్త తెలిసిన వెంటనే మార్టూరులో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుండగా, బంధువులు, గ్రామస్థులు పరామర్శించారు. లోకేశ్కు ఒక సోదరుడు ఉన్నారు.
అమెరికాలోని తెలుగు సంఘాలు, స్నేహితులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహకరిస్తున్నారు. త్వరలోనే అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇటీవల అమెరికాలో తెలుగు విద్యార్థులు, యువకుల మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కాల్పులు, ఇతరత్రా సంఘటనలు వారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
