
న్యూస్ డెస్క్: తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల వేడిలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ మద్దతుతో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి గ్రామానికి తక్షణమే రూ. 10 లక్షల అభివృద్ధి నిధులను కేటాయిస్తానని ఆయన ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
డిసెంబర్ 11 నుంచి 17 వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ఆఫర్ ద్వారా రాబోయే లోక్సభ శాసనసభ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏకగ్రీవంగా బీజేపీ మద్దతు సర్పంచ్ను ఎన్నుకుంటే, రూ. 10 లక్షలు వ్యక్తిగతంగా అందజేస్తామని బండి తెలిపారు. ఈ నిధులను ఎంపీ ల్యాండ్స్, కేంద్ర నిధులు కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బండి సంజయ్ ఆఫర్పై అధికార కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇది నిధుల ఎర వేసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రయత్నమని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి, నిధులను ఇలా బహిరంగంగా ప్రకటించడం అనైతికం అని విమర్శించారు.
అయితే, అభివృద్ధి నిధుల లభ్యత లేమితో బాధపడుతున్న గ్రామాలకు ఈ రూ.10 లక్షలు గొప్ప అవకాశం. ఎన్నికల ఖర్చులు విభేదాలు లేకుండా ఏకగ్రీవాలకు మొగ్గు చూపేవారు ఈ ఆఫర్కు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
బండి సంజయ్ వేసిన ఈ ‘బంపర్ ఆఫర్’ అనే తొలి రాజకీయ అస్త్రం కరీంనగర్ గ్రామీణ ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో, మిగతా పార్టీల ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.
