
న్యూస్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, మొహమ్మద్ అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని 1.2 లక్షలకు పైగా ఉన్న మైనారిటీ ఓట్లే లక్ష్యంగా ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
పక్కా హైదరాబాదీ అయిన అజారుద్దీన్ చేరికతో కేబినెట్లో మైనారిటీ, హైదరాబాద్ ప్రాతినిధ్య ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం శుక్రవారమే ఉండొచ్చని, దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (మాజీ పైలట్) తర్వాత కేబినెట్లో రెండో ‘కెప్టెన్’ చేరినట్లవుతుందని అంటున్నారు.
మూడు వన్డే ప్రపంచకప్లకు (1992, 96, 99) కెప్టెన్గా వ్యవహరించిన అజార్, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో కెరీర్ను ముగించారు. 2009లో కాంగ్రెస్ తరఫున మొరాదాబాద్ ఎంపీగా గెలిచారు. 2023లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు (గవర్నర్ ఆమోదం రావాల్సి ఉంది).
తెలంగాణ కేబినెట్లో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మందే ఉన్నారు. అజార్ చేరికతో మరో రెండు బెర్తులు ఖాళీగా ఉంటాయి. ఒకవేళ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆమోదం పొందకపోతే, భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానం నుంచి ఆయన్ను మండలికి పంపే అవకాశం ఉంది.
ఈ వ్యూహాత్మక నియామకం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకును పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
