
న్యూస్ డెస్క్: రియల్ ఎస్టేట్ రంగం ఏ రాష్ట్రానికైనా ఆర్థిక జీవనాడి. నిర్మాణ రంగం పుంజుకుంటే, ఖజానా నిండటమే కాదు, వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ, ఇప్పుడు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మాస్టర్ ప్లాన్లను అమలు చేస్తోంది.
ఈ అభివృద్ధిలో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణం, దాన్ని అనుసంధానించే జాతీయ రహదారుల నిర్మాణం కీలకంగా మారింది. ఇందులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్ట్ ‘విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి’. ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, ఈ ప్రాంతం దశ ఒక్కసారిగా మారబోతోంది.
గతంలో మారుమూల ప్రాంతాలుగా ఉన్న విజయవాడ శివారు గ్రామాలు, మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధికి నడిబొడ్డుగా మారుతున్నాయి. ఈ హైవే విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యానికే కాదు, ఈ ప్రాంతాన్ని ఓ లాజిస్టిక్స్ హబ్గా మార్చే బృహత్తర ప్రణాళికలో భాగం.
దారి ఏర్పడితే, పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం అవే క్యూ కడతాయి. మౌలిక సదుపాయాలు మెరుగైతే, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. ఈ కొత్త జాతీయ రహదారి ప్రాజెక్ట్, విజయవాడ శివారు ప్రాంతాలు, మచిలీపట్నం రాతను మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్తును ముందుగానే ఊహించిన పెట్టుబడిదారులు, ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భూములపై దృష్టి సారించారు. రానున్న కాలంలో ఇక్కడ భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ హబ్లు వెలవడం ఖాయం. నిన్నటి వరకు మధ్యతరగతి ప్రాంతాలుగా ఉన్న ఈ గ్రామాలు, అతి తక్కువ సమయంలోనే అపర కుబేరుల నివాసాలుగా మారే అవకాశం ఉంది.
