
ఏపీ: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు ప్రజాప్రయోజన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని అధికారికంగా ఆమోదించారు.
ఇప్పటికే ప్రకటించిన ఈ పథకాన్ని మంత్రివర్గం చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇక నాయీ బ్రాహ్మణులు నడిపే సెలూన్లకు ప్రస్తుతం ఉన్న 150 యూనిట్ల ఉచిత విద్యుత్ పరిమితిని 200 యూనిట్లకు పెంచారు.
ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్తిస్తుంది. అలాగే ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుంది.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను డిజిటల్ కార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త కార్డుల్లో లబ్ధిదారుల వివరాలు ప్రత్యేక చిప్లోకి నిక్షిప్తం చేయబడతాయి. ఇది సాంకేతిక పరంగా ముందడుగు.
సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్న నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, కల్లు గీత కార్మికులకు 10 శాతం బార్లను కేటాయించి, దరఖాస్తు ఫీజులో కూడా రాయితీ ఇవ్వనున్నారు.
అలాగే రాష్ట్రంలో టెక్ హబ్ అభివృద్ధికి “ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0″కు ఆమోదం లభించింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చారు.
తిరుపతి పరిధిలో ఓబరాయ్ హోటల్ కోసం కేటాయించిన టీటీడీ భూమిని తిరిగి రద్దు చేశారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రూ.900 కోట్లు గ్యారంటీ, ఏపీఐఐసీకి రూ.7500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
