
ఆంధ్రప్రదేశ్: విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రక్రియ దశాబ్దంలో పూర్తి కావాల్సి ఉన్నా, జనాభా గణన వాయిదాల వల్ల ఆలస్యమైంది. తాజాగా 2028 నాటికి ఇది ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్న అంచనాల కంటే కూడా మరో 25 స్థానాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలకు మరో 50 జతకలిసి మొత్తం 225 స్థానాలు అందుబాటులోకి రానున్నాయి.
అయితే పరిపాలన క్షేత్రస్థాయిలోకి తీసుకురావడం, పెరుగుతున్న యువ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సంఖ్యను మరో 25 పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఈ అదనపు 25 స్థానాలను పెంచడం ద్వారా యువతకు ప్రాధాన్యం పెరగడంతో పాటు, అందరికీ అవకాశం లభిస్తుందన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ దిశగా ఆయన న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నారు.
మరో 25 స్థానాల పెంపునకు కేంద్రం ఓకే చెబితే, మొత్తం 250 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించనుంది.
